లవ్ సింబల్‌తో గాజు వంతెన.. తెలంగాణలో ఇదే మొదటిది!

Telanganas First Glass Bridge with Love Symbol Coming Soon in Hussnabad
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో నిర్మాణం
  • హృదయాకారంలో 150 మీటర్ల పొడవున ప్రత్యేక ఆకర్షణ
  • మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో సుందరీకరణ పనులు
  • కొద్ది నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న వంతెన
తెలంగాణలో పర్యాటక రంగం కొత్త సొబగులు అద్దుకుంటోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వేగంగా రూపుదిద్దుకుంటోంది. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తుండటం విశేషం. పర్యాటకులను ఆకర్షించేందుకు దీనిని హృదయాకారంలో (లవ్ సింబల్) డిజైన్ చేశారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రూ.4.22 కోట్ల వ్యయంతో, 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దీనిని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం గ్లాస్ బ్రిడ్జికే పరిమితం కాకుండా, చెరువు పరిసరాలను పూర్తిస్థాయి వినోద కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, పచ్చదనంతో కూడిన గార్డెన్లు, ప్రత్యేక లైటింగ్, సెల్ఫీ పాయింట్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు.

ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు నెలల్లో సాంకేతిక, భద్రతాపరమైన తనిఖీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే తొలి గాజు వంతెన కావడంతో నిర్మాణం జరుగుతుండగానే స్థానికులు, పర్యాటకులు దీనిని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Go Back to Shorts
Glass Bridge
Ponnam Prabhakar
Telangana tourism
Hussnabad
Yellamma Cheruvu
Siddipet district
Kakatiya dynasty
Tourism development
Love symbol bridge
Telangana

More Telugu News