జగన్కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్
- వైసీపీకి తాను గొడ్డలి పార్టీ అని పేరు పెడితే జగన్ బాగా ఫీల్ అయ్యారన్న లోకేశ్
- జగన్ సినిమాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైనికులదేనని పిలుపు
- గొడ్డలి పోట్లు పొడవడం జగన్ నైజమని వ్యాఖ్య
- కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు సైకోలు కుట్రలు చేస్తున్నారని మండిపాటు
- జగన్ క్రిమినల్ మైండ్ ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'గొడ్డలి పార్టీ', 'హత్యా రాజకీయాలు' అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు... ఈరోజు కడపలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
వైసీపీకి తాను కొత్తగా 'గొడ్డలి పార్టీ' అని పేరు పెడితే జగన్ బాగా ఫీల్ అయ్యారని... కానీ గతంలో థియేటర్లలో 'రప్పారప్పా' అంటూ గన్ కల్చర్ను సమర్థించింది మీ కుటుంబ సభ్యులే కదా అని లోకేశ్ నిలదీశారు. జగన్ రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తే, దానికి ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైనికులదేనని ఆయన స్పష్టం చేశారు.
కడపలో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద దస్తగిరిని చంపేసింది జగన్ మేనమామేనని... కానీ తిరిగి తామేదో తప్పు చేసినట్లు తమపై కేసులు పెడతామని బెదిరించడం హాస్యాస్పదమన్నారు. జగన్ చేసే మోసాలు, అబద్ధాలు చూస్తుంటే ఆయనకు 'చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు.
ప్రజల ముందుకు వస్తే ముద్దులు పెట్టడం.. లోపలికి వెళ్తే గొడ్డలి పోట్లు పొడవడం జగన్ నైజమని.. ఆయన చేసే ఈ అద్భుత నటనకు ఆస్కార్ కాదు, 'భాస్కర్ అవార్డు' గ్యారంటీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కూటమి ప్రభుత్వం (టీడీపీ, జనసేన, బీజేపీ) మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సైకోలు కుట్రలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. "రాయలసీమ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం దాటి తరిమేశారు. సొంత బాబాయిని లేపేసి, మరో చెల్లి కుటుంబానికి తీరని అన్యాయం చేశారు" అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
2019 ఎన్నికల ముందు వివేకానందరెడ్డి చనిపోతే మొదట గుండెపోటు అన్నారని, ఆ తర్వాత గొడ్డలివేటు బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఆ వెంటనే సొంత దొంగ పేపర్ లో 'నారాసుర రక్తచరిత్ర' అని రాసి చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లు గ్రాఫిక్స్ ఫొటోలు వేసి, రాజకీయం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. జగన్ ఎంతటి మోసగాడో, ఆయన క్రిమినల్ బ్రెయిన్ ఎలాంటిదో సొంత కడప జిల్లా ప్రజలతో పాటు యావత్ ఏపీకి క్లియర్గా అర్థమైందని వ్యాఖ్యానించారు.