నారా లోకేశ్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్పై మాటల యుద్ధం!
- కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును సమర్థించిన లోకేశ్
- బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు దక్షిణాదికి నష్టం చేశాయని విమర్శ
- లెక్కలు చూసుకోవాలంటూ చిదంబరం కౌంటర్
- లోక్సభలో దక్షిణాది వాటా తగ్గుతుందని వివరణ
- 2026 జనాభా లెక్కల తర్వాత అయితే మరీ నష్టమన్న లోకేశ్
లోక్సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్.. లోకేశ్ అంతే ఘాటుగా రీకౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.
లోకేశ్ ఏమన్నారు?
‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును గట్టిగా సమర్థించారు. ఈ బిల్లును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం సీట్ల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దీనివల్ల తమిళనాడు, కేరళ ఏడు స్థానాలు, ఆంధ్రప్రదేశ్ మూడు, తెలంగాణ ఒక లోక్సభ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
చిదంబరం కౌంటర్
లోకేశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘నా యువ మిత్రుడు లోకేశ్ డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు కాస్త లెక్కలు సరిచూసుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన బిల్లు వల్ల లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుతుందని చెప్పారు. సీట్లను యాభై శాతం పెంచినా లాభం ఉత్తరాది రాష్ట్రాలకేనని, ఏపీ సీట్లు 25 నుంచి 38కి పెరిగినా మొత్తం సీట్లలో ఏపీ వాటా తగ్గిపోతుందని వాదించారు.
లోకేశ్ రీ-కౌంటర్
చిదంబరం ట్వీట్పై మంత్రి లోకేశ్ అంతే వేగంగా స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న సీట్ల ఫ్రీజ్ 2026 జనాభా లెక్కల తర్వాత ముగుస్తుందని గుర్తుచేశారు. ఆ తర్వాత పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం ఖాయమన్నారు. ఈ నష్టాన్ని ఆపడానికే ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు తెచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ బిల్లును పార్లమెంట్లో ఎందుకు అడ్డుకున్నారో చిదంబరం చెప్పాలని లోకేశ్ నిలదీశారు.