ఏఐ, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకతపై ఉన్న‌తాధికారుల‌తో సీఎం చంద్ర‌బాబు వ‌ర్క్‌షాప్

  • వర్క్‌షాప్‌కు హాజరై ప్రారంభోపన్యాసం చేసిన సీఎం చంద్రబాబు
  • ఏఐ, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై సీఎం మార్గనిర్దేశం 
  • ఈ వర్క్‌షాప్‌కు హాజరైన‌ సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు
‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్‌షాప్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు హాజ‌రై, ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.  

ఈ వర్క్‌షాప్‌కు సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ హాజర‌య్యారు. అలాగే వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాశ్‌ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్‌తో సహా పలువురు నిపుణులు కూడా వ‌చ్చారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జ‌రిగింది. 

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలన జ‌రిగింది. ఏయే విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపై నిపుణులు ప్రజంటేషన్ ఇచ్చారు.   

ఏఐ, ఎంఎల్, డీఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్క్‌షాప్‌లో మొదటిరోజు కార్యదర్శులు, రెండోరోజు విభాగాధిపతులు హాజరుకానున్నారు. 




More Telugu News