టీడీపీ కార్యకర్తపై దాడి... నందిగం సురేశ్ అరెస్ట్

  • గతరాత్రి ఇసకపల్లి రాజు అనే టీడీపీ కార్యకర్తపై దాడి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడి భార్య
  • కేసు నమోదు చేసుకున్న తుళ్లూరు పోలీసులు
  • నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

గతరాత్రి అమరావతి రాజధాని పరిధిలోని ఉద్ధండరాయునిపాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. దాంతో, ఆ కారు డ్రైవర్ ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు. ఈ నేపథ్యంలో, రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేసి, అతడిని సురేశ్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ రాజుపై నందిగం సురేశ్, అతడి సోదరుడు ప్రభుదాస్ దాడి చేశారని బాధితుడి భార్య లక్ష్మి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దాంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేశ్ తదితరులపై కేసు నమోదు చేసి, ఇవాళ అతడిని అరెస్ట్ చేశారు. సురేశ్ సోదరుడు ప్రభుదాస్, మరికొందరు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నేడు నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం పట్ల అతడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త అరెస్ట్ ను నిరసిస్తూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది.


More Telugu News