కూలిన విమానంలో 'అసాధారణ పరిస్థితులు'... ఓ ప్రయాణికుడి వీడియో వైరల్!

  • ఎయిర్ ఇండియా విమానంలో అసాధారణ దృశ్యాలు
  • ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళుతుండగా ఘటన
  • ప్రయాణికుడు వీడియో తీసి పోస్ట్
  • రెండు గంటల తర్వాత అదే విమానానికి ప్రమాదం
  • విమాన భద్రతపై ప్రశ్నలు
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో 242 మంది ఉన్నారు. కాగా, ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా, టేకాఫ్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. కాగా, అహ్మదాబాద్-లండన్ ట్రిప్పుకు ముందు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఈ ట్రిప్పులో ప్రయాణిస్తున్నప్పుడు విమానంలో కొన్ని 'అసాధారణ విషయాలు' గమనించానని ఓ ప్రయాణికుడు వెల్లడించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ విమానం తన తదుపరి ప్రయాణంలో ప్రమాదానికి గురైన తర్వాత, సదరు ప్రయాణికుడు తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో విమానంలో కొన్ని సమస్యలను గమనించినట్లు తెలిపాడు. వీటిని అతడు తన కెమెరాలో వీడియో కూడా తీశాడు. విమానంలో ఏసీ పనిచేయకపోవడం, పీడనం పెరిగిపోవడం వంటి సమస్యలతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్న వైనాన్ని అతడి వీడియో చిత్రీకరించాడు. డ్రీమ్ లైనర్ విమానం అయ్యుండి, ఇలాంటి పరిస్థితులు అసహజంగా ఉన్నాయని అతడు పేర్కొన్నాడు. ఈ ప్రయాణం ముగిసిన కేవలం రెండు గంటల వ్యవధిలోనే, అదే విమానం తన తదుపరి ట్రిప్పులో ప్రమాదానికి గురైంది.

ఈ విమాన ప్రమాదం జరిగిన అనంతరం, ప్రయాణికుడు తాను అంతకుముందు రికార్డు చేసిన వీడియోను బయటపెట్టారు. తాను ప్రయాణించిన విమానంలోనే ఇలాంటి ఘటన జరగడం, దానికి కొన్ని గంటల ముందే తాను కొన్ని తేడాలను గమనించానని ఆయన తన పోస్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, విమాన భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ప్రయాణికుడు తన వీడియోలో పేర్కొన్న అసాధారణ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఆధారంగా పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News