Kunamneni Sambasiva Rao: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. బౌన్సర్ల విధానంపై ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

CPI MLA Kunamneni Sambasiva Rao Sensational Comments On Bouncers
  • బౌన్సర్లు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్న సీపీఐ ఎమ్మెల్యే
  • ఆ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
  • రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు సెన్సార్ అనుమతులు వద్దని విజ్ఞప్తి
  • తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయొద్దన్న సీపీఐ నేత
సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతిలో మార్పు రావాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను నేడు పరామర్శించిన ఆయన.. వైద్యులను అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శ్రీతేజ ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్పారని తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన వెంటనే పోలీసులు సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణాలు దక్కాయని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటన సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారిందని, దీనిని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. 

బౌన్సర్లు గూండాల్లా ప్రవర్తిస్తుండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. సామాజిక సందేశాత్మక సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వకుండా పోలీసు వ్యవస్థను అణచివేసేలా రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం బాధాకరమని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు.
Kunamneni Sambasiva Rao
CPI
Sandhya Theater Stampede
Allu Arjun

More Telugu News