ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం
- పాక్కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ
- ఢిల్లీ వ్యూహాత్మక నిర్ణయంతో కరాచీలో తీవ్ర సంక్షోభం
- దాహంతో అల్లాడుతున్న కరాచీ నగర జనాభా
- నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు
- నిలువు దోపిడీ చేస్తున్న అక్రమ వాటర్ మాఫియా
కరాచీలో కన్నీరు
సింధు ఒప్పందానికి బ్రేక్ పడటంతో కరాచీ నగరంలో నీటి సంక్షోభం ముదిరింది. దాదాపు మూడు కోట్ల జనాభా ఉన్న ఈ నగరంలో 70 శాతం మందికి పైగా నీళ్లు అందడం లేదు. రోజుకు 400 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత వేధిస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. రెండు వారాలుగా చుక్క నీరు రాకపోవడంతో కరాచీ ప్రజలు అలమటిస్తున్నారు.
వాటర్ మాఫియా
ప్రభుత్వ నీటి సరఫరా వ్యవస్థ కుప్పకూలడంతో కరాచీలో ‘వాటర్ మాఫియా’ రాజ్యమేలుతోంది. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమ నిర్వాహకులు రేట్లను ఇష్టారాజ్యంగా పెంచేసి దోచుకుంటున్నారు. ఎండలు మండిపోతున్న వేళ కరాచీ ప్రజలకు ఈ వాటర్ ట్యాంకర్లు కొనడం భారంగా మారింది.
పాలకుల చేతకానితనం
ఈ నీటి సంక్షోభం పాకిస్థాన్లో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. సింధ్ ప్రావిన్స్లో దాదాపు ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్నా కరాచీ నీటి సమస్యను పీపీపీ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని ప్రతిపక్ష జమాతే ఇస్లామీ అధినేత హఫీజ్ నయీమ్ ఉర్ రెహమాన్ మండిపడ్డారు. నగరంలో నీటి కొరత లేదంటూ మేయర్ చేస్తున్న ప్రకటనలు పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు.
ఢిల్లీ పట్టు
కరాచీలో కనిపిస్తున్న ఈ నీటి సంక్షోభం వెనుక భారత్ వ్యూహాత్మక పట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకే భారత్ ఈ ఆరు దశాబ్దాల ఒప్పందాన్ని పక్కన పెట్టింది. నీటి లభ్యతను నియంత్రిస్తూ పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాక్ తన బుద్ధి మార్చుకుని ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపే వరకు భారత్ అస్సలు తగ్గేలా కనిపించడం లేదు.