కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం: పృథ్వీరాజ్
- ఇండస్ట్రీలో ప్రమోషన్ల ట్రెండ్ను తప్పుబట్టిన పృథ్వీ
- కాలేజీల్లో స్టూడెంట్స్ను కలవడం వేస్ట్ అని వ్యాఖ్య
- ఒక్కడు కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడడన్న పృథ్వీ
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్తో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ తాజాగా మూవీ ప్రమోషన్స్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ‘రిస్క్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన... ప్రస్తుత చిత్ర పరిశ్రమలో ప్రచారాల పేరిట జరుగుతున్న ట్రెండ్ను తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సినిమా ప్రమోషన్స్ అంటూ భారీగా ఖర్చు చేస్తూ, కాలేజీల చుట్టూ తిరుగుతూ స్టూడెంట్స్ను కలుస్తున్నారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. అయితే, అక్కడ గోల, ఈలలు, అరుపులు తప్ప.. ఒక్క విద్యార్థి కూడా తర్వాత థియేటర్ కి వచ్చి సినిమా చూడటం లేదని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశారు. కాలేజీలకు వెళ్లి ప్రమోషన్ల పేరిట డబ్బును వృథాగా తగలెయ్యద్దని ఆయన సూచించారు. ఆ ఖర్చుకు బదులుగా డిజిటల్ ప్లాట్ఫామ్లను సరైన పద్ధతిలో ఉపయోగించుకుని, సినిమాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హితవు పలికారు.