ఇంగ్లండ్ టూర్ కు వైభవ్ సూర్యవంశీ? సంకేతాలు పంపిన బీసీసీఐ కార్యదర్శి!
- ఐపీఎల్ 2026లో అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
- యువ సంచలనాన్ని జాతీయ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సంకేతాలు
- వైభవ్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సెలక్టర్లకు సూచన
- ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడిని ఎంపిక చేసే అవకాశం
- ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు సాధించిన వైభవ్
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 16 మ్యాచ్లలో 237.31 స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో అత్యధికంగా 72 సిక్సర్లు కొట్టడంతో పాటు 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కూడా గెలుచుకున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్ శైలితో, అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ విషయంపై జాతీయ మీడియాతో మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, వైభవ్పై ప్రశంసలు కురిపించారు. "వైభవ్ అద్భుతమైన ఆటగాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక సమావేశాల్లో, సెలక్టర్లు అతని ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, అతనికి ఏది మంచిదో అదే చేస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. వైభవ్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బీసీసీఐ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు.
ఈ నెలాఖరులో భారత జట్టు ఐర్లాండ్తో రెండు టీ20లు, ఆ తర్వాత ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో వైభవ్కు తొలిసారిగా టీమిండియా నుంచి పిలుపు వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా, వయసుతో సంబంధం లేకుండా వైభవ్ను ఎంపిక చేయాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ను బహిరంగంగా కోరారు. ఇప్పటికే ఇండియా 'ఏ' జట్టులో ఉన్న వైభవ్ను నేరుగా సీనియర్ జట్టుకు ప్రమోట్ చేసేందుకు బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.