రోహిత్ రిటైర్మెంట్ వెనుక ఇంత జరిగిందా?

  • టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాలు 
  • రోహిత్ రిటైర్మెంట్‌పై సంచలన నివేదికను బయటపెట్టిన ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ స్కై స్పోర్ట్స్
  • రోహిత్ శర్మ అభ్యర్ధనను బీసీసీఐ సెలక్షన్ కమిటీ తిరస్కరించిందని వెల్లడి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకస్మికంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం విదితమే. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని, అందుకే రోహిత్ ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే రోహిత్ రిటైర్మెంట్‌పై తాజాగా ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ స్కై స్పోర్ట్స్ సంచలన నివేదికను వెలుగులోకి తీసుకువచ్చింది.

ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా తనను ఎంపిక చేయాలని, టూర్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి రోహిత్ తెలియజేశాడని, అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం రోహిత్‌ను కేవలం ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేస్తామని, కెప్టెన్‌గా వేరే ఆటగాడికి అవకాశం ఇస్తామని చెప్పిందని సదరు వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ పరిణామ క్రమంలోనే రోహిత్ శర్మ అనూహ్యంగా తన కేరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ తన కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి 12 విజయాలు నమోదు చేసుకోగా, 9 ఓటములు, మూడు డ్రాలు నమోదు చేశాడు. 


More Telugu News