శృంగారం కోసం గాళ్‌ఫ్రెండ్ బలవంతం.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

  • హిమాచల్‌ప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి అర్పిత్ ఆత్మహత్య
  • యువతి వేధించి, శారీరక సంబంధానికి బలవంతం చేసిందని ఆరోపణ
  • ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా యువతి అరెస్ట్
  • కొడుకును యువతి బ్లాక్ మెయిల్ చేసిందని మృతుడి తల్లి ఫిర్యాదు
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ యువతి తనను వేధించి, శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసిందన్న ఆరోపణలతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కళాశాల హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. హమీర్‌పూర్ జిల్లాకు చెందిన అర్పిత్ (20) సుందర్‌నగర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ట్రైనీగా ఉన్నాడు. శనివారం ఉదయం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్పిత్ జేబులోంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన సహ విద్యార్థిని అయిన లావణ్య తనను వేధించిందని, మానసికంగా హింసించిందని అర్పిత్ రాశాడు. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు లావణ్యను అరెస్ట్ చేశారు.

సుందర్‌నగర్ డీఎస్పీ భరత్ భూషణ్ మాట్లాడుతూ ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించిందని, తదుపరి విచారణ నిమిత్తం హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు.

మృతుడు అర్పిత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ లావణ్య తన కుమారుడిని బ్లాక్ మెయిల్ చేసి, తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని ఆరోపించారు. చనిపోవడానికి ముందు అర్పిత్ ఈ విషయాలను తనతో పంచుకున్నాడని, లావణ్య తనను శారీరక సంబంధం కోసం బలవంతం చేసిందని చెప్పినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మే నెలలో అర్పిత్‌కు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కళాశాల యాజమాన్యం సరిగ్గా స్పందించలేదని కూడా ఆమె ఆరోపించారు. ఆ సమయంలో సహాయం చేయాల్సింది పోయి, హాస్టల్ ఖాళీ చేయమని కాలేజీ యాజమాన్యం కోరిందని, దీంతో మే 4 నుంచి 8వ తేదీ వరకు సుందర్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ విశ్రాంతి గృహంలో ఉండాల్సి వచ్చిందని, అక్కడ తాను కూడా ఉండి కుమారుడికి సేవలు చేశానని తెలిపారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న లావణ్యను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు.  


More Telugu News