ముగిసిన ఐపీఎల్ 2025.. విజేతల జాబితా ఇదే!

  • జీటీ ఆటగాడు సాయి సుదర్శన్‌కు 'ఆరెంజ్ క్యాప్', ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు
  • ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు 'మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్' పురస్కారం
  • వైభవ్ సూర్యవంశీకి దక్కిన 'కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' గౌరవం
  • గుజరాత్ బౌలర్ ప్రసిధ్ కృష్ణకు 'పర్పుల్ క్యాప్'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులను అలరించింది. నిన్న రాత్రి న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్‌తో టోర్నీ ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందజేశారు. గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, మరో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచి కీలక అవార్డులను సొంతం చేసుకున్నారు.

సాయి సుదర్శన్ అదుర్స్
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. టోర్నమెంట్ మొత్తంలో 759 పరుగులతో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. నిలకడైన బ్యాటింగ్‌తో గుజరాత్ టైటాన్స్ జట్టుకు అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతోపాటు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా సుదర్శన్ దక్కించుకోవడం విశేషం. అంతేకాకుండా, మోస్ట్ ఫాంటసీ పాయింట్స్ అవార్డు కూడా అతనికే లభించింది. ఈ సీజన్‌లో అత్యధికంగా 88 ఫోర్లు కొట్టి తన బ్యాటింగ్ పటిమను చాటాడు.

సూర్యకుమార్ ‘మోస్ట్ వ్యాల్యుబుల్’
ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ 'మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్' (ఎంవీపీ) అవార్డును గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో 717 పరుగులు చేసిన సూర్యకుమార్, టీ20 ఫార్మాట్‌లో తనను తాను మరోసారి అత్యంత నమ్మకమైన, విధ్వంసకర బ్యాటర్‌గా నిరూపించుకున్నాడు. మైదానంలో అతని సృజనాత్మక షాట్లు, అద్భుతమైన బ్యాటింగ్ శైలి ముంబై ఇండియన్స్ జట్టు టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడానికి దోహదపడ్డాయి.

వైభవ్ మెరుపులు
ఈ సీజన్‌లో తన వేగవంతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ 'కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును అందుకున్నాడు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు రాబట్టగల సామర్థ్యంతో తన ఫ్రాంచైజీ లైనప్‌కు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో అదనపు బలాన్ని చేకూర్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అత్యంత ఆశాజనకమైన ఆటగాళ్లలో ఒకడిగా వైభవ్ నిలిచాడు.

గుజరాత్ టైటాన్స్ పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్‌ 2025లో అత్యధిక వికెట్లు తీసినందుకు పర్పుల్ క్యాప్ ద‌క్కించుకున్నాడు. ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ 25 వికెట్లు పడగొట్టి జీటీ ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌ 2025 అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇదే..
  • ఐపీఎల్‌ 2025 ఛాంపియన్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • రన్నరప్: పంజాబ్ కింగ్స్
  • ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్ (జీటీ) - 759 పరుగులు
  • పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ (జీటీ) - 25 వికెట్లు
  • అత్యంత విలువైన ఆటగాడు: సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ) - 320.5 MVP పాయింట్లు
  • ఎమర్జింగ్ ప్లేయర్: సాయి సుదర్శన్ (జీటీ)
  • సూపర్ స్ట్రైకర్: వైభవ్ సూర్యవంశీ (ఆర్ఆర్‌) – స్ట్రైక్ రేట్: 207
  • అత్యధిక ఫోర్లు: సాయి సుదర్శన్ (జీటీ) – 88 ఫోర్లు
  • అత్యధిక సిక్సర్లు: నికోలస్ పూరన్ (ఎల్ఎస్‌జీ) – 40 సిక్సర్లు
  • అత్యధిక డాట్ బాల్స్: మహ్మద్ సిరాజ్ (జీటీ) – 151 డాట్స్
  • ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్
  • సీజన్‌లో ఉత్తమ క్యాచ్: కమిండు మెండిస్ (ఎస్ఆర్‌హెచ్‌) – డెవాల్డ్ బ్రెవిస్ (సీఎస్‌కే) క్యాచ్‌


More Telugu News