అహ్మదాబాద్ విమాన ప్రమాదం: మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
  • మూడు రోజుల తర్వాత డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహం గుర్తింపు
  • రూపానీ కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోలిన నమూనాలు
  • మొత్తం 32 మంది మృతుల డీఎన్‌ఏ నమూనాలు సరిపోలినట్లు వెల్లడి
  • తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపులో జాప్యం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఆయన భౌతికకాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు.

విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో, ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం డీఎన్‌ఏ సరిపోలిందని, దీంతో అది రూపానీదేనని నిర్ధారించుకున్నామని సంఘ్వీ తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఈ విమాన ప్రమాదం అత్యంత తీవ్రమైనది కావడంతో అనేక మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో మృతుల గుర్తింపు ప్రక్రియ సవాలుగా మారింది. ఇప్పటివరకు మొత్తం 32 మంది మృతుల డీఎన్‌ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యుల జన్యు నమూనాలతో సరిపోలినట్లు అధికారులు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షలకు సమయం పడుతుండటంతో మృతదేహాల గుర్తింపులో కొంత జాప్యం జరుగుతోందని వైద్యులు వివరించారు. 

ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 274 మంది వరకు మరణించారు. 


More Telugu News