వెంటిలేట‌ర్‌పై నటుడు ఫిష్ వెంక‌ట్‌.. సాయం కోసం భార్య వేడుకోలు

  • ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం అత్యంత విషమం
  • కిడ్నీ సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక
  • ప్రస్తుతం వెంటిలేటర్‌పై కొన‌సాగుతున్న వైద్య చికిత్స
  • కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెబుతున్న వైద్యులు
  • ఆదుకోవాలంటూ సినీ పరిశ్రమకు, దాతలకు భార్య‌ విజ్ఞప్తి
 తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన విలనిజం, కామెడీతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్, ఇటీవల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఆయన ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి. గతంలో డయాలసిస్ చేయించుకుని కొంత కోలుకున్నప్పటికీ, ఇప్పుడు సమస్య మళ్లీ తీవ్రమైంద‌ని తెలుస్తోంది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఫిష్ వెంకట్ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నామని, దయచేసి తమను ఆదుకోవాలని ఆయన భార్య, కుమార్తె మీడియా ద్వారా దాతలను, సినీ ప్రముఖులను వేడుకుంటున్నారు. "దయచేసి మా ఫ్యామిలీని కాపాడండి" అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. గతంలో ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం డయాలసిస్‌తో చికిత్స అందిస్తున్నా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, ఆయనకు కిడ్నీ మార్పిడి చేయడం అత్యవసరమని వైద్యులు స్పష్టం చేశారు. అయితే కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కావడంతో ఆ భారాన్ని మోయలేక కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.

ఫిష్ వెంక‌ట్‌ సుమారు వందకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇలాంటి నటుడు నేడు ప్రాణాలతో పోరాడుతుండటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా), తోటి నటీనటులు స్పందించి ఆయనకు ఆర్థికంగా అండగా నిలవాలని అభిమానులు కోరుతున్నారు.





More Telugu News