నా సక్సెస్ సీక్రెట్ అదే: శుభ్‌మన్ గిల్

  • ఇంగ్లాండ్‌పై టెస్టులో గిల్ చారిత్రాత్మక డబుల్ సెంచరీ
  • 269 పరుగులతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన భారత కెప్టెన్
  • టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు రికార్డు బ్రేక్
  • బ్యాటింగ్‌ను ఆస్వాదించడమే త‌న విజయ రహస్యమన్న గిల్
భారత జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో అద్వితీయమైన డబుల్ సెంచరీతో చెలరేగిన విష‌యం తెలిసిందే. మొత్తం 269 పరుగులు సాధించి, టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (254 నాటౌట్‌) రికార్డును అధిగమించాడు. గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఇలా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన అనంతరం శుభ్‌మన్ గిల్ తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. "కొంతకాలంగా పరుగుల ఒత్తిడితో బ్యాటింగ్‌ను ఆస్వాదించలేకపోయాను. ఈ సిరీస్‌లో ఆ ఒత్తిడిని పక్కనపెట్టి, చిన్నప్పుడు ఆడినట్లుగా స్వేచ్ఛగా ఆడాలనుకున్నాను. అదే నాకు బాగా కలిసొచ్చింది" అని గిల్ తెలిపాడు. తన బేసిక్ మూవ్స్‌, సెటప్‌పై దృష్టి సారించడం కూడా ఫామ్‌లోకి రావడానికి దోహదపడిందని వివరించాడు.

తొలి రోజు ఆటలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడినప్పుడు, గౌతమ్ గంభీర్‌తో మాట్లాడానని గిల్ వెల్లడించాడు. "వికెట్ బాగున్నప్పుడు క్రీజులో కుదురుకుంటే, ఎంతసేపైనా బ్యాటింగ్ చేయాలని, సులభంగా వికెట్ చేజార్చుకోకూడదని నిర్ణయించుకున్నాను. గత మ్యాచ్ అనుభవం నాకు ఈ విషయంలో ఉపయోగపడింది" అని అన్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సేనా (SENA) దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ మరో రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. 


More Telugu News