జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ సెంచరీలు... భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

  • టీమిండియా భారీ స్కోరుకు ఇంగ్లండ్ దీటైన బదులు
  • హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అద్భుత సెంచరీలు
  • 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఇంగ్లండ్
  • ఆరో వికెట్‌కు బ్రూక్-స్మిత్ అజేయ భాగస్వామ్యం
  • మూడు వికెట్లతో రాణించిన మహమ్మద్ సిరాజ్
  • తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగుల భారీ స్కోరు
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అద్భుత సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లు ఆరంభంలోనే విరుచుకుపడి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చినప్పటికీ, ఈ ఇద్దరూ అసాధారణ పోరాటంతో జట్టును ఆదుకున్నారు. భారత తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరుకు దీటుగా బదులిస్తూ, తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఒకానొక దశలో 84 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఓపెనర్లు డకెట్, పోప్ డకౌట్ కాగా, రూట్, కెప్టెన్ స్టోక్స్ కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయగా, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆరో వికెట్‌కు ಜೊತೆ కట్టిన హ్యారీ బ్రూక్ (121 బ్యాటింగ్), జేమీ స్మిత్ (152 బ్యాటింగ్) అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి, అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా స్మిత్ కేవలం 157 బంతుల్లోనే 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు సాధించడం విశేషం. బ్రూక్ కూడా నిలకడగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి పోరాటంతో ఇంగ్లండ్ తేరుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి, భారత్ స్కోరుకు ఇంకా 256 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు, శుభ్‌మన్ గిల్ (269) డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే.


More Telugu News