కళ్లుచెదిరే బడ్జెట్‌తో రణ్‌బీర్ ‘రామాయణ’ .. రెండు భాగాలకు ఏకంగా రూ.1600 కోట్లు!

  • తొలి భాగానికి రూ.900 కోట్లు, రెండో భాగానికి రూ.700 కోట్లు
  • భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డు
  • రాముడిగా రణ్‌బీర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌
  • 2026 దీపావళికి మొదటి భాగం విడుదల చేసేందుకు ప్లాన్
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమాపై ఓ భారీ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.1600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే భారత సినీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవడం ఖాయం.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని రూ. 900 కోట్లతో, రెండో భాగాన్ని రూ. 700 కోట్లతో నిర్మిస్తున్నారనేది ఆ వార్త‌ల సారాంశం. మొదటి భాగంలో రామాయణ ప్రపంచాన్ని సృష్టించేందుకు భారీ సెట్టింగులు వేస్తుండటంతో బడ్జెట్ ఎక్కువగా ఉందని, రెండో భాగంలో ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. నేటి తరానికి రామాయణ గాథను ఓ అద్భుతమైన విజువల్ వండర్‌గా అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు ఈ భారీ బడ్జెట్‌కు వెనుకాడడం లేదని సమాచారం.

ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2026 దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


More Telugu News