'సంక్రాంతికి వస్తున్నాం' జబర్దస్త్‌ స్కిట్‌ కాదు: దర్శకుడు అనిల్‌ రావిపూడి

  • పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అనిల్‌ 
  •  ఒకరిద్దరు చేసిన కామెంట్స్‌ను పట్టించుకోను 
  •  నాగార్జునతో 'హలో బ్రదర్‌' లాంటి సినిమా చేస్తాను!
వెంకటేష్‌, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. 

ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ హౌప్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకపోతోంది. కాగా, ఈ చిత్ర దర్శకుడు అనిల్‌ తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

మీ చిత్రంలోని కామెడీని కొంత మంది జబర్దస్త్‌ స్కిట్స్‌తో పోల్చడం పట్ల మీ స్పందన ఏమిటని అనిల్‌ను ప్రశ్నించగా ''నా ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నా ప్రతి సినిమాకు ఇలాంటి కామెంట్స్‌ విని విసిగిపోయాను. కానీ నా సినిమాలకు ప్రేక్షకులు ఘనవిజయాన్ని అందించారు. ఎవరో ఒకరిద్దరూ చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే నా లక్ష్యం" అని అన్నారు.  

"ఆడియన్స్‌ సపోర్ట్‌తో ఇప్పటి వరకు నా కెరీర్‌లో నిరాశజనకమైన రోజులను చూడలేదు. వాళ్లు నేను ఏ జోనర్‌ సినిమా చేసిన ఆదరించారు. వాళ్ల ఆదరణతో నా కెరీర్‌లో అన్నీ మంచి రోజులు, సంతోషకరమైన రోజులే చూశాను" అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. 

దర్శకుడి కావాలనే తన కోరిక 'పటాస్‌'తో తీరిందని, ఇప్పుడు అంతా బోనస్‌గా భావిస్తున్నానని, చిరంజీవితో ఓ ఎంటర్‌టైనర్‌ సినిమా చేయాలనుందని, నాగార్జునతో 'హలో బ్రదర్‌' లాంటి సినిమా తీయాలనుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 


More Telugu News