ల‌క్నో కెప్టెన్ పంత్‌కు భారీ జ‌రిమానా... కార‌ణ‌మిదే!

  • ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషభ్‌ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా
  • ఈ సీజ‌న్‌లో ల‌క్నో రెండోసారి స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు 
  • జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ప్లేయింగ్ ఎలెవెన్‌లోని అంద‌రికీ ఫైన్‌
ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్  కార‌ణంగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) కెప్టెన్ రిషభ్‌ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా ప‌డింది. ఈ సీజ‌న్‌లో ల‌క్నో రెండోసారి స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేయ‌డంతో కెప్టెన్‌కు ఐపీఎల్ కౌన్సిల్‌ భారీ ఫైన్ వేసింది. అలాగే జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా అంద‌రూ రూ. 6ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానాగా చెల్లించాల‌ని ఆదేశించింది. 

"కనీస ఓవర్ రేట్ త‌ప్పిదాల‌కు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో ల‌క్నో జట్టు రెండోసారి స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేసింది. అందుకే పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌ సహా ప్లేయింగ్ ఎలెవెన్‌లోని మిగిలిన సభ్యులకు రూ. 6లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాలి" అని ఐపీఎల్ కౌన్సిల్ త‌న‌ ప్రకటనలో పేర్కొంది.

ఇక, ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసిన విష‌యం తెలిసిందే. ఎంఐ నిర్దేశించిన 216 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఎల్ఎస్‌జీ 161 పరుగులకు ఆలౌట్ అయింది.


More Telugu News