నీర‌జ్ చోప్రాకు ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు

  • దోహా డైమండ్ లీగ్‌లో అద‌ర‌గొట్టిన నీర‌జ్ చోప్రా
  • కెరీర్‌లోనే తొలిసారి 90.23 మీటర్ల మార్క్‌ అందుకున్న వైనం
  • ఈ సంద‌ర్భంగా నీర‌జ్‌పై ప్ర‌శంస‌లు
  • ఎక్స్ వేదిక‌గా భారత గోల్డెన్‌ బాయ్‌ను మెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ
శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో భార‌త స్టార్ అథ్లెట్ నీరజ్‌ చోప్రా స‌రికొత్త రికార్డు నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. నీరజ్ త‌న కెరీర్‌లోనే తొలిసారి 90.23 మీటర్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (89.94 మీట‌ర్లు)ను భారత గోల్డెన్‌ బాయ్ అధిగ‌మించాడు.  

అయితే, దోహా డైమండ్ లీగ్‌లో మాత్రం మ‌నోడు రెండో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యాడు. జ‌ర్మ‌నీకి చెందిన అథ్లెట్ జులియన్‌ వెబర్‌ బ‌ల్లెంను ఏకంగా 91.06 మీటర్లు విసిరి విజేత‌గా నిలిచాడు. కాగా, కెరీర్ బెస్ట్ త్రో చేసిన నీర‌జ్ చోప్రాపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అభినందించారు. అద్భుత‌మైన మైలురాయిని సాధించావు, దేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది అంటూ నీర‌జ్‌ను ప్ర‌ధాని మెచ్చుకున్నారు.  

"అద్భుతమైన ఫీట్! దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచికి ద‌క్కిన‌ ఫలితం. భారతదేశం ఉప్పొంగి, గర్వంగా ఉంది" అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.  


More Telugu News