లండన్‌లోని కుమార్తెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకొని, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనంతలోకాలకు..!

  • అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలి ఘోర ప్రమాదం
  • కుమార్తె కాన్వొకేషన్ కోసం లండన్ వెళ్తున్న తల్లిదండ్రులు, మరొకరు మృతి
  • ముందే వెళ్లి కుమార్తెను ఆశ్చర్యపరచాలన్న ప్రణాళిక విషాదాంతం
కుమార్తె కాన్వొకేషన్ వేడుకకు హాజరై ఆమెను ఆశ్చర్యపరచాలని ఆశించిన తల్లిదండ్రుల ప్రయాణం విషాదంగా ముగిసింది. వారు ప్రయాణిస్తున్న విమానం అహ్మదాబాద్‌లో కూలిపోవడంతో ఆ యువతి తల్లిదండ్రులతో పాటు ఓ బంధువును కూడా కోల్పోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం సమీపంలోని హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు కొందరు హాస్టల్ విద్యార్థులు కూడా మరణించారు. అదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు మాత్రమే ఈ పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.

గుజరాత్‌లోని వసాద్‌కు చెందిన రజనీకాంత్ పటేల్, దివ్యబెన్ దంపతులు, దివ్యబెన్ సోదరి హేమాంగి బెన్‌తో కలిసి లండన్‌లో ఉంటున్న తమ కుమార్తె ధ్వని పటేల్ కాన్వొకేషన్ వేడుకకు బయలుదేరారు. వాస్తవానికి వారు జూన్ 17న ప్రయాణించాల్సి ఉండగా 21 ఏళ్ల కుమార్తెకు సర్‌ప్రైజ్ ఇచ్చి ఆమెతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ప్రయాణ తేదీని ముందుకు జరుపుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. సంతోషంగా జరగాల్సిన ఆ కుటుంబ కలయిక విషాదంగా మారింది. కుమార్తెను చూడకుండానే వారు శాశ్వతంగా దూరమయ్యారు.

ఈ దుర్ఘటనతో పటేల్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. హేమాంగి బెన్ కుమారుడు పార్థ్ పటేల్ ఎనిమిది నెలల క్రితమే తండ్రిని కోల్పోయాడు. ఇప్పుడు తల్లి కూడా విమాన ప్రమాదంలో మరణించడంతో ఒంటరివాడయ్యాడు. ఆనంద్ ఎంపీ, రజనీకాంత్ పటేల్ స్నేహితుడైన మితేష్ పటేల్ పార్థ్‌ను వారి నివాసంలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


More Telugu News