కోడలు ఐశ్వర్యారాయ్ గురించి అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు

  • కొడుకు అభిషేక్‌ను మాత్రమే పొగుడుతారన్న విమర్శలపై అమితాబ్‌ స్పందన
  • భార్య జయ, కోడలు ఐశ్వర్యలను మనసులోనే ప్రశంసిస్తానన్న బిగ్‌బీ
  • మహిళలపై గౌరవంతోనే అలా చేస్తానని వెల్లడి
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ, తన అభిప్రాయాలను పంచుకునే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, తాజాగా తనపై వస్తున్న కొన్ని విమర్శలకు స్పందించారు. ముఖ్యంగా తన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ను తరచూ ప్రశంసించడం, అదే సమయంలో భార్య జయా బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌లను పెద్దగా పొగడకపోవడంపై కొందరు నెటిజన్లు ఆయన్ను ప్రశ్నించారు. ఈ విమర్శలకు బిగ్‌బీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

ఓ అభిమాని ఇదే ప్రశ్నను అమితాబ్‌ను అడగ్గా, "నిజమే, నేను అభిషేక్‌ను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయాబచ్చన్‌, కోడలు ఐశ్వర్యను కూడా ప్రశంసిస్తాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటుంటాను. అది నాకు మహిళలపై ఉన్న గౌరవం" అని ఆయన బదులిచ్చారు. అభిషేక్‌కు అందరిపైనా ప్రేమ, గౌరవం ఎక్కువని కూడా అమితాబ్‌ తెలిపారు.

మరోవైపు, అమితాబ్‌ నివాసం 'జల్సా' వద్దకు ఆయన్ను చూసేందుకు వచ్చే అభిమానులను ఉద్దేశించి ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యలకు కూడా బిగ్‌బీ ఘాటుగా స్పందించారు. ఆ అభిమానులంతా నిరుద్యోగులని, అందుకే జల్సా వద్దకు వచ్చి ఎదురుచూస్తుంటారని ఆ నెటిజన్‌ కామెంట్ చేయగా, అమితాబ్‌ స్పందిస్తూ, "అలాంటప్పుడు మీరు వారికి ఉద్యోగం ఇవ్వండి. అయినా వారు నా ప్రేమలో గొప్ప ఉన్నతోద్యోగులే" అని కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల అభిషేక్‌ బచ్చన్‌ నటించిన 'హౌస్‌ఫుల్‌ 5' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, సంజయ్‌దత్‌, జాకీ ష్రాఫ్‌ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. తరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సానుకూల స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో అభిషేక్‌ నటనను ప్రశంసిస్తూ అమితాబ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై పై విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది. 


More Telugu News