పొదిలిలో మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి లోకేశ్‌

  • మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామ‌న్న మంత్రి
  • జగన్ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశార‌ని విమ‌ర్శ‌
  • ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని ఫైర్‌
పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామ‌న్నారు. 

జగన్ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని లోకేశ్ విమ‌ర్శించారు. సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారని దుయ్య‌బ‌ట్టారు. 

తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని, సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేన‌ని లోకేశ్ అన్నారు. మహిళలపై వైసీపీ నేతలు ఒళ్లు బలిసి మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైసీపీ చేసిన దాడికి జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 


More Telugu News