సూపర్ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

  • కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది 
  • ఈ సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ప‌థ‌కం ప్రారంభం
  • రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం
  • 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు
  • ఈ పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం తెలిపింది. 

కాగా, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. దీంతో 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపజేయ‌నుంది. ఇందులో భాగంగా తల్లుల ఖాతాల్లో రేపు ప్రభుత్వం రూ. 8,745 కోట్లు జమ చేయనుంది. 

1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు కానుంది. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ప‌థ‌కం విధి విధానాలను ఖరారు చేస్తూ అధికారులు ఇవాళ జీఓ విడుదల చేయ‌నున్నారు. 

ఇక‌, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన విష‌యం తెలిసిందే. 



More Telugu News