మిత్రదేశంపైనే గూఢచర్యం.. ఇజ్రాయెల్పై అమెరికాకు అనుమానాలు?
- ఇజ్రాయెల్ గూఢచర్యంపై పెంటగాన్ అనుమానాలు
- ఉన్నతాధికారులపై నిఘా పెట్టే అవకాశం ఉందని హెచ్చరిక
- ఇజ్రాయెల్ పర్యటనలో బర్నర్ ఫోన్లు వాడాలని అధికారులకు సూచన
- ఇరాన్ వివాదంలో ట్రంప్, నెతన్యాహు విభేదాలే కారణం
- గూఢచర్యం ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్
ఈ తాజా నివేదిక నేపథ్యంలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లే యూఎస్ అధికారులకు నిబంధనలను కఠినతరం చేశారు. ఉన్నత స్థాయి చర్చల కోసం వెళ్లేవాళ్లు సాధారణ ఫోన్లకు బదులుగా ‘బర్నర్ ఫోన్లు’, తాత్కాలిక కంప్యూటర్లను మాత్రమే వాడనున్నారు. హోటల్ గదుల్లో ఎలాంటి సున్నితమైన విషయాలను మాట్లాడొద్దని సూచించారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సమాచారాన్ని సేకరించడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తాయని ఇప్పటికే పేరుంది.
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ యుద్ధంపై వస్తున్న విభేదాలే ఈ తాజా వివాదానికి కారణం. ఇటీవల ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నారు. కానీ ఇరాన్పై మళ్లీ సైనిక దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పట్టుబడుతున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఫోన్ సంభాషణలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, నెతన్యాహును పిచ్చివాడు అని సంబోధించారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే ఈ గూఢచర్య ఆరోపణలను వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. తమపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వివరించింది. ఇజ్రాయెల్ ఎప్పుడూ అమెరికా ప్రభుత్వ అధికారులపై నిఘా పెట్టదని, తమ శత్రువులపై మాత్రమే నిఘా ఉంచుతుందని పేర్కొంది. అటు వైట్ హౌస్ కూడా ఈ వార్తలను అధికారికంగా ఖండించింది. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య అంతర్గతంగా నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.