వైసీపీని గండ్ర గొడ్డలి పార్టీగా మార్చారు: జగన్ పై మంత్రి వాసంశెట్టి ఫైర్
- జగన్ తన సొంత ఇంటి నుంచే వెన్నుపోటు రాజకీయాన్ని ప్రారంభించారన్న వాసంశెట్టి
- కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వదల్లేదని విమర్శ
- జగన్ ప్రెస్మీట్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన సొంత ఇంటి నుంచే వెన్నుపోటు రాజకీయాన్ని ప్రారంభించారని, వెన్నుపోటు దినానికి ఆయనే కేరాఫ్ అడ్రస్ అని మండిపడ్డారు. కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా జగన్ వదల్లేదని... బాబాయ్కి వెన్నుపోటుతో పాటు గొడ్డలి పోటు కూడా వేయించి వైసీపీని 'గండ్ర గొడ్డలి పార్టీ'గా మార్చారని విమర్శించారు.
జగన్ మానసిక స్థితిపై కూడా మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్కు ఇచ్చే మందుల డోస్ పెంచితే ఏమవుతుందోనని వైద్యులు భయపడుతున్నారని... ఆయనకు అప్పుడప్పుడు కరెంట్ షాక్ లాంటి చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. జగన్ ప్రెస్మీట్లను ప్రజలు కేవలం 'స్ట్రెస్ రిలీఫ్' కోసం చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పేకాట క్లబ్లు, క్యాసినోలు నడిపించే బ్యాచ్కు విద్యా వ్యవస్థలోని బ్రిడ్జ్ కోర్సుల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల' కార్యక్రమం అభాసుపాలైందని, ప్రజల మద్దతు లేక వైసీపీ నేతలే మళ్లీ మళ్లీ సంతకాలు పెడుతూ ఇబ్బంది పడ్డారని మంత్రి సుభాష్ దుయ్యబట్టారు.