అమెరికా మ్యూజియంలో ఇస్రో సైంటిస్ట్ చీర.. ఎందుకంత ప్రత్యేకం?
- ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్ చీరకు అరుదైన గౌరవం
- అమెరికా స్మిత్సోనియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పట్టుచీర
- మంగళయాన్ మిషన్ కీలక సమయంలో ఆమె ఈ చీరను ధరించారు
- భారత అంతరిక్ష విజయానికి, మహిళా శక్తికి ప్రతీకగా గుర్తింపు
- అమెరికా తొలి మహిళా వ్యోమగామి వస్తువుల పక్కనే ప్రదర్శన
ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) ప్రాజెక్టుకు నందిని డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా వ్యవహరించారు. 2013 డిసెంబర్ 1న, మంగళయాన్ వ్యోమనౌకను భూ కక్ష్య దాటించి అంగారకుడి వైపు పంపే ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. ఆ రోజును ఒక 'డూ ఆర్ డై' సందర్భంలా భావించిన నందిని, తనకు ఎంతో ఇష్టమైన ఎరుపు, నీలం రంగుల పట్టుచీరను ధరించి విధులకు హాజరయ్యారు. ఆ మిషన్ 2014 సెప్టెంబర్ 24న విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి చేరి చరిత్ర సృష్టించింది.
2020లో మ్యూజియం క్యూరేటర్ మాట్ షిండెల్, నందినిని సంప్రదించి ఈ చీర ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో భారత్ సాధించిన అంతరిక్ష విజయం, సైన్స్ (STEM) రంగంలో మహిళలకు స్ఫూర్తినివ్వడం వంటి అంశాలకు ప్రతీకగా ఈ చీరను ఎంపిక చేశారు. మ్యూజియంలోని 'ఫ్యూచర్స్ ఇన్ స్పేస్' గ్యాలరీలో, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి అమెరికన్ మహిళ శాలీ రైడ్ టీ-షర్ట్ పక్కనే దీనిని ప్రదర్శిస్తుండటం విశేషం. ఈ మ్యూజియం సేకరణలో ఇది మొదటి చీర కాగా, ఇంటర్ప్లానెటరీ సైన్స్ విభాగంలో ప్రదర్శనకు ఉంచిన తొలి భారతీయ వస్తువు కూడా ఇదే.