లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'

ప్రాణి మనుగడకు సూర్యరశ్మి ఎంతో అవసరం. మూడు నెలల పాటు సూర్యుడు సెలవు పెడితే భూమిపై ఒక్క ప్రాణీ బతికి ఉండదు. భానుడి అవసరం అంతగా ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరంలో కొన్ని రకాల జీవ క్రియలు చక్కగా సాగిపోవాలంటే సూర్యుడి కిరణాలు మన శరీరాన్ని తాకాలి. సూర్యుడి కిరణ శక్తి మనలోని ప్రతీ కణానికి అందాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ డీ సరిపడా ఉత్పత్తి అప్పుడే అవుతుంది. దాంతో ఎన్నో వ్యాధులు దూరంగా ఉంటాయి. తరచూ అనారోగ్యానికి గురికావడం ఆగిపోతుంది.
ఎండంటే కొందరికి చిరాకు...! ఓ రోజు ఎండ ఎక్కువైందంటే నోటి వెంట నిట్టూర్పులు వచ్చేస్తాయ్. ఎండలో బయటకు వెళ్లాలంటే గ్లామర్ దెబ్బతింటుందంటారు కొందరు. ఇదంతా ఆధునిక సుఖమయ జీవన విధానం కారణంగా ఏర్పడిన విడ్డూరాలే. ఒకప్పుడు ఎండలోకి వెళ్లకుండా ఏ పనీ అయ్యేది కాదు. కానీ నేడు కాలు తీసి బయట పెట్టిన దగ్గర్నుంచి, తిరిగి ఇంటికి చేరుకునే వరకూ గట్టిగా ఐదు నిమిషాలు కూడా వంటికి ఎండ తగలకుండా ఎన్నో ఏర్పాట్లున్నాయి. ఆ సూర్యుడి కిరణ శక్తిని గ్రహించకపోవడం సర్వ సాధారణమైపోయిందికానీ, ఒక్కసారి ఆలోచించండి. 20, 30 ఏళ్ల క్రితం ఇన్నేసి వ్యాధులు, అనారోగ్య సమస్యలున్నాయా....? లేవు. కానీ నేడు ఈ పరిస్థితులకు కారణం సూర్యకిరణాలను నేరుగా శరీరానికి సోకే అవకాశం ఇవ్వకపోవడమేనంటున్నారు నిపుణులు.
సూర్యుడి కిరణాల కారణంగా మన శరీరంలో హార్మోన్ల పరంగా కొన్ని మార్పులు జరుగుతాయి. సూర్యుని కిరణాల వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనం హ్యాపీగా ఉండేందుకు ఎంతో కీలకమైనది. మనసును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది. అదే చీకటి పడితే ఆ చీకటి మన మెదడుకు సంకేతాలు పంపుతుంది. దాంతో మెదడు మెలటోనిన్ అనే హర్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ నిద్ర సంకేతాలను ఇస్తుంది. దాంతో ప్రశాంతంగా నిద్ర పోతారు. తగినంత సూర్యరశ్మి పొందకుంటే మన శరీరంలో సెరటోనిన్ స్థాయులు తగ్గిపోతాయి. దాంతో ప్రవర్తనపరమైన మార్పులు, డిప్రెషన్, ఒత్తిడికి లోను కావడం, త్వరగా అలసిపోవడం, మంచి మూడ్ లో ఉండకపోవడం ఇలా ఎన్నో సమస్యలు కనిపిస్తాయ్. వీటికి కారణం విటమిన్ డీ లోపించడమే. రోజులో తగినంత సూర్యరశ్మిని పొందడం వల్ల వచ్చే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
సూర్యరశ్మి మన కంట్లో రెటీనాలోని ప్రత్యేక ప్రదేశాలను ప్రేరేపిస్తుంది. దాంతో సెరటోనిన్ విడుదల అధికమవుతుంది. మాయో క్లినిక్ అధ్యయనం ప్రకారం... సెరటోనిన్ తగ్గడం వల్ల ఎస్ఏడీ(శాడ్) సమస్యల బారిన పడతారని, మరీ ముఖ్యంగా పగటి సమయం తక్కువగా, రాత్రి వేళలు ఎక్కువగా ఉండే శీతాకాలంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని తెలిసింది. దీనికి చికిత్స లైట్ థెరపీ. దీన్నే ఫొటోథెరపీ అని కూడా అంటారు. రోజుల వయసున్న శిశువుల్లో కామెర్లు తగ్గకుంటే ఈ చికిత్సనే ఉపయోగిస్తారు. ఈ కాంతి మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించి సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సూర్యరశ్మికి లోను కావడం వల్ల మహిళల్లో రుతుస్రావానికి ముందు మానసికంగా ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడిలో ఉన్న గర్భిణిలకు కూడా మేలు చేస్తుంది. అంటే ఒత్తిళ్లు, మానసిక పరమైన చిరాకు పోగొట్టుకోవాలంటే రోజూ ఎండలో నిర్ణీత సమయం పాటు ఉండడం చాలా అవసరమని తెలుస్తోంది.
వ్యాధుల్లేకుండా చేస్తుంది...ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట సూర్యుని కిరణాలు నేరుగా వంటిపై పడేలా చూసుకుంటే 90 శాతం వ్యాధులు నశిస్తాయట. ఇలా ఎండలో కూర్చునే ముందుగా చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. దీంతో సూర్యుని కిరణాలు మన శరీరంలోని ప్రతీ కణాన్ని చేరతాయి. దీనివల్ల కణాలు చైతన్యవంతం అవుతాయి. దాంతో వ్యాధులు నశిస్తాయి. సూర్యుని కిరణాలు ప్రతీ కణానికి చేరడం వల్ల కణాలు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. అయితే, వ్యాధి బారిన పడిన కణాలను ఇవి చేరలేవు. అందుకే వైద్యులు తమ పరిశోధనలో భాగంగా వ్యాధి బారిన పడిన కణాలకు సూర్యుని శక్తిని అందించే ఓ చిన్న పరికరాన్ని కనుగొన్నారు. ఉదాహరణకు హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తి గుండె ప్రాంతంలో పెట్టినట్టయితే ఆ పరికరం నుంచి సూర్యుని కిరణ శక్తి వ్యాధి బారిన పడిన కణాలకు చేరుతుంది. దాంతో సమస్య నయమవుతున్నట్టు గుర్తించారు. అందుకే సూర్యుని కిరణాలు వ్యాధుల బారి నుంచి రక్షణ కల్పించేవిగా చెబుతారు.
శిశువులకు సంజీవని
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను పరీక్షించగా వారిలో విటమిన్ డీ తక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. మరో అధ్యయనం ప్రకారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరే ప్రతీ ఐదుగురు శిశువుల్లో ఇద్దరు విటమిన్ డీ లోపం కారణంగానేనని వెల్లడైంది. సెప్టిక్ షాక్ (రక్తపోటు గణనీయంగా పడిపోవడం) తో ఆస్పత్రిలో చేరే చిన్నారుల్లోనూ ఉండాల్సిన దానికంటే తక్కువగా విటమిన్ డీ ఉన్నట్టు గుర్తించారు. అందుకే శిశువులకు విటమిన్ డీ డ్రాప్స్ ను సూచిస్తుంటారు. శిశువులకు వచ్చే జాండిస్ సమస్య నివారణకు, రికెట్స్ వ్యాధి నివారణకు సూర్యుని కిరణాలు అవసరం.
సూర్యుని కిరణాలతో కేన్సర్ వస్తుందా...?అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలిందేమంటే... అక్కడ ఉండే 57 రాష్ట్రాల్లో 37 రాష్ట్రాల్లో సూర్యరశ్మి తగినంత లభిస్తుంది. అక్కడ కేన్సర్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. సూర్యరశ్మి తక్కువగా ఉండే మరో 20 రాష్ట్రాల్లో కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. కనుక సూర్యరశ్మి వల్ల కేన్సర్ నయమవుతుందే కానీ, సూర్యుని కిరణాలతో కేన్సర్ వ్యాధి రాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సూర్యుని అల్ట్రావయలెట్ కిరణాల వల్ల చర్మానికి హాని కలుగుతుందని, కేన్సర్ సోకుతుందనే ప్రచారాన్ని సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు చేస్తుంటాయి. అయితే, ప్రకృతి వైద్యం, పర్యావరణ, ఇతర వైద్య నిపుణుల వాదన ప్రకారం అసలు ఈ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాల వల్లే కేన్సర్ సోకుతుందనే ఆరోపణ ఉంది. ముఖ్యంగా పెదాలకు రాసుకునే లిప్ స్టిక్ లో ప్రో ఈస్ట్రోజెన్ అనే హర్మోన్ ఉంటుందట. దీనివల్ల స్త్రీలలో వక్షోజాల పరిమాణం పెరిగిపోతుంది. ఫలితంగా వారిలో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు పెరిగిపోతుందట.
ఎండలోకి వెళితే కేన్సర్ వస్తుందనేది అపోహేనని, సూర్యరశ్మి కేన్సర్ నివారిణి అని చెబుతారు. ఎండ కారణంగా కేన్సర్ సోకినట్టు ఇప్పటి వరకూ ఎక్కడా నిర్ధారణ కాలేదన్నది వారి వాదన. రోజంతా ఎండలో కూలీ పనులు చేసుకునే కార్మికులు ఎక్కువ సమయం పాటు సూర్యుని కిరణాలకు నేరుగా లోనయ్యేవారే. మరి వారిలో కేన్సర్ కేసులు చాలా తక్కువగా ఎందుకుంటున్నాయన్న ప్రశ్న కూడా వారి నుంచి వినిపిస్తుంది. ఇదంతా కంపెనీల విషపు ప్రచారమన్నది ఆరోపణ. సూర్య రశ్మి లోపిస్తే కొలన్ కేన్సర్, హాడ్కిన్స్ లింఫోమా, ఒవేరియన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్ ముప్పు వుందని ఓ పరిశోధన వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూర్యరశ్మికి గురి కావడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు నయం అవుతాయని చెబుతోంది. రోజులో 15 నిమిషాల పాటు సూర్యుని కిరణాలు చర్మంపై, శరీరంపై పడేలా చూసుకుంటే తగినంత విటమిన్ డీ తయారవుతుందని చెబుతోంది. సోరియాసిస్, ఎక్జెమా, జాండిస్, యాక్నేలకు యూవీ రేడియేషన్ కిరణాలు చర్మంపై పడేలా చూసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. విటిలిగో, అటోపిక్ డెర్మటైటిస్, స్క్లెరోడెర్మా వ్యాధులకు కూడా సూర్యుని కిరణాలు పనిచేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ ను ప్రేరేపించడం వల్ల చర్మానికి యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. గుండెకు రక్షణ కూడా లభిస్తుంది. గాయాలు నయం అవుతాయి. టీబీ వ్యాధికి 100 ఏళ్ల క్రితం ఎండలో కూర్చోబెట్టడమే చికిత్సగా ఉండేది. మెలనోమా నుంచి సైతం రక్షణ లభిస్తుంది.